25-05-2026: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక 89వ వార్డు ఆదర్శనగర్ ప్రాంతంలో విస్తృత స్థాయి పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ శానిటరీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆదర్శనగర్ పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గాజు సీసాలు మరియు ఇతర చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజారోగ్యానికి ఎంతో అవసరమని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, తడి చెత్త మరియు పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ప్రతిరోజూ వచ్చే జీవీఎంసీ చెత్త సేకరణ వాహనానికి అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, జీవీఎంసీ శానిటరీ సిబ్బంది, జేడీ గ్రూప్ సభ్యులు మరియు స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



