16-04-2026: పర్యావరణ పరిరక్షణ మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో పెన్ డ్రాప్ బాక్స్లు ఏర్పాటు చేయడం జరిగింది.
విద్యార్థులు మరియు పరిశోధకులు అధికంగా వినియోగించే లైబ్రరీ ప్రాంగణంలో వాడిన పెన్నులను బహిరంగ ప్రదేశాల్లో పడవేయకుండా, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్లలో వేయాలని అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం లైబ్రేరియన్ ప్రొఫెసర్ ఆచార్య సి.హెచ్. శ్రీనివాసరావు గారి సమక్షంలో నిర్వహించబడింది. సెంట్రల్ లైబ్రరీలోని ప్రధాన భవనం, టెక్స్ట్ బుక్ రీడింగ్ రూమ్ మరియు ఇతర ముఖ్య ప్రదేశాల్లో పెన్ డ్రాప్ బాక్స్లను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, వాడిన ప్లాస్టిక్ పెన్నులను నిర్లక్ష్యంగా పారవేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, విద్యార్థులు వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్లలో వేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని సూచించారు.

జేడీ ఫౌండేషన్ చేపడుతున్న “Stop Landfill – Drop Used Pens Here” కార్యక్రమం ద్వారా వాడిన పెన్నులను సేకరించి, వాటిని సరైన రీసైక్లింగ్ మరియు వ్యర్థాల నిర్వహణ కోసం సంబంధిత అధికారులకు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం విద్యాసంస్థల్లో పర్యావరణ అవగాహన పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.

ఈ కార్యక్రమంలో లైబ్రరీ సూపరింటెండెంట్ శ్రీ హరికృష్ణ గారు, లైబ్రరీ అసిస్టెంట్లు శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, శ్రీ సుబ్రమణ్యం గారు, శ్రీ ఎం. శ్రీనివాస్ గారు, శ్రీమతి హైమవతి గారు, శ్రీ వై.వి. స్వామి గారు, ఇతర సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గింపుకు కృషి చేస్తున్న జేడీ ఫౌండేషన్ భవిష్యత్తులో మరిన్ని విద్యాసంస్థల్లో ఇలాంటి కార్యక్రమాలను విస్తరించాలని సంకల్పించింది.


