24-01-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణతో పాటు జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల)లో విద్యార్థినులతో కలిసి పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులతో వంకాయ, టమాటో, కాలిఫ్లవర్, మిరప తదితర కూరగాయ మొక్కలు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల విత్తనాలు, అలాగే దొండ, చిక్కుడు, పాదులు, మునగ వంటి మొక్కలను నాటించడం జరిగింది.

ముందుగా మొక్కల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర, ప్రకృతి సమతుల్యతకు చెట్ల అవసరం వంటి అంశాలపై విద్యార్థినులకు వివరించారు. అనంతరం విద్యార్థినులే స్వయంగా మొక్కలు నాటి వాటికి నీరు పోసి సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి స్వర్ణలత గారు మాట్లాడుతూ జేడీ ఫౌండేషన్ సభ్యులు తరచూ తమ పాఠశాల విద్యార్థినులను పర్యావరణ కార్యక్రమాలలో భాగస్వామ్యులు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇతర ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థినులు మరియు జేడీ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
పొలంబడి కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, పర్యావరణ చైతన్యం
మరియు బాధ్యతా భావం పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ ముందుకు సాగుతోంది.





